కొడుకుని కాపాడి తల్లి ప్రాణత్యాగం – మార్కాపురం బస్సు ప్రమాదంలో హృదయ విదారక ఘటన
మార్కాపురం, ఆధాబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన కొడుకు ప్రాణాలను కాపాడేందుకు ఓ తల్లి తన ప్రాణాలను త్యాగం చేసిన సంఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
వివరాల్లోకి వెళితే… కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి (45) తన కుమారుడు మనోహర్తో కలిసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో స్వగ్రామానికి వెళ్తున్నారు. ప్రయాణం జరుగుతున్న సమయంలో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రమాదాన్ని గుర్తించిన రమాదేవి, తన కుమారుడిని వెంటనే కిటికీ ద్వారా బయటకు తోసి అతని ప్రాణాలను రక్షించారు. అయితే మంటలు క్షణాల్లోనే ఉద్ధృతంగా మారడంతో ఆమె బస్సులోనే చిక్కుకుపోయి సజీవదహనమయ్యారు. కొడుకు కళ్లెదుటే తల్లి ప్రాణాలు కోల్పోవడం అక్కడున్న వారిని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
తల్లి ప్రేమ, త్యాగానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన గ్రామస్థులను కన్నీళ్లు పెట్టించింది. మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.









