ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం… ట్రావెల్స్ బస్సు దగ్ధం, 10 మంది సజీవ దహనం
మార్కాపురం,ఆధాబ్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్లో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొని భారీ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు, లారీ రెండూ క్షణాల్లోనే మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమయ్యాయి.
ప్రమాద తీవ్రత వల్ల బస్సులో ప్రయాణిస్తున్న వారిలో కనీసం 10 మంది సజీవ దహనమయ్యారని సమాచారం. బస్సులో మొత్తం సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. మిగతా ప్రయాణికుల్లో పలువురు గాయపడినట్లు సమాచారం.
ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం, ఈ బస్సు హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొన్న వెంటనే మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు బయటకు రావడానికి అవకాశమే లేకపోయిందని చెబుతున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.









