వైరాలో ఏసీబీ దాడి – మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్
ఖమ్మం ప్రతినిధి ,ఆధాబ్ న్యూస్
ఖమ్మం జిల్లా వైరాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం దాడి నిర్వహించి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వి. ప్రసాద్ను లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ప్రైవేట్ అసిస్టెంట్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
పెనుబల్లి ప్రాంతానికి చెందిన ఒక కాంట్రాక్టర్ ఇటుక రవాణా కోసం నాలుగు ట్రాక్టర్లు, ఐదు టిప్పర్లను నడిపేందుకు అనుమతులు పొందాల్సి ఉండగా, ఇందుకు గాను ప్రసాద్ నెలకు ₹24,800 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఒక్కో టిప్పర్కు ₹3,200, ఒక్కో ట్రాక్టర్కు ₹2,200 చొప్పున డబ్బులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు మంగళవారం ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో లంచం ఇస్తున్న సమయంలో ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.









