మణుగూరు BC హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటన – 17 మంది విద్యార్థులు అస్వస్థత.
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు MJPTC BC హాస్టల్లో ఆహార విషబాధ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో 16 మందిని మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, మరో విద్యార్థికి ప్రాథమిక చికిత్స అందించి తిరిగి హాస్టల్కు పంపించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) మణుగూరు ఏరియా ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. చికిత్స పొందుతున్న విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారు తీసుకున్న ఆహారం, ఎదురైన ఆరోగ్య సమస్యల గురించి వివరాలు తెలుసుకున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు వాంతులు మరియు కడుపు నొప్పి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు.
తదుపరి DM&HO మణుగూరు MJPTC BC హాస్టల్ను కూడా సందర్శించి, అక్కడ RBSK బృందాలు మరియు PHC మణుగూరు వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి అవసరమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
అలాగే హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్స్కు విద్యార్థులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే సమీప వైద్య అధికారులకు సమాచారం అందించాలని, అవసరమైనప్పుడు తక్షణ ప్రథమ చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఏరియా ఆసుపత్రి బాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.









