పినపాక మండలంలో YVR చిల్డ్రెన్ & వెల్ఫేర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు
పినపాక,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో YVR Children & Welfare Trust (Young Vision for the Rural) ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా పినపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎడుళ్లబయ్యారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, దూగినెపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జనంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి బోర్డు పరీక్షలు రాయబోయే విద్యార్థులకు పరీక్షల కోసం అవసరమైన ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్లు, పెన్సిళ్లు, ఏరేజర్లు, లాంగ్ స్కేల్లు, నోట్బుక్స్, చిన్న బ్యాగులు, జియామెట్రీ బాక్స్లు పంపిణీ చేశారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో ఈ విద్యాసామగ్రి ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
అదేవిధంగా మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు డ్రాయింగ్ పుస్తకాలు మరియు క్రాయాన్లు అందజేసి, వారి సృజనాత్మకతను పెంపొందించే విధంగా పలు ఆకర్షణీయమైన కార్యకలాపాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు రామటెంకి రమేష్, దేవి మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షల్లో 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్పొరేట్ కళాశాలలో చదివే అవకాశం కల్పిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొని ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.









