అడమయ్యకు ఘన నివాళి… ఆదివాసుల సమస్యలపై పోరాటమే నిజమైన స్మరణ: సిపిఎం నాయకులు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే పొడియం అడమయ్యకు ఇచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న అన్నారు. శుక్రవారం కరకగూడెం పంచాయతీ పరిధిలోని అశ్వాపురం గ్రామంలో నిర్వహించిన అడమయ్య సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ, సిపిఎం పార్టీకి అడమయ్య సేవలు ఎనలేనివని తెలిపారు. చత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడి, స్థానిక ఆదివాసుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. గ్రామ స్థాపనతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి కోసం పార్టీ సహకారంతో ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లారని చెప్పారు.
పోడు భూములు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం అనేక ఆందోళనలు చేపట్టిన ఫలితంగా రేషన్ కార్డులు, పింఛన్లు వంటి సదుపాయాలు అందాయని తెలిపారు. అడమయ్య లేని లోటు పార్టీకి పెద్ద నష్టమని పేర్కొంటూ, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వలస ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పనిచేయడమే అడమయ్యకు నిజమైన నివాళి అని అన్నారు. ఆయన కుటుంబానికి సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొమరం కాంతారావు, పినపాక మండల కార్యదర్శి దుబ్బ గోవర్ధన్, గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు మడివి రమేష్, పార్టీ నాయకులు కురుసం లక్ష్మయ్య, పొడియం మంగయ్య, కోవాసి వెంకటేశ్వర్లు, పదం బాబురావు, ఎస్ఎఫ్ఐ నాయకులు మాదాసు అఖిల్ తదితరులు పాల్గొన్నారు.








