కోరిన చోట బస్సు ఆపాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 25, ఆధాబ్ న్యూస్:
పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు తమ హాల్ టికెట్లు చూపిస్తే, వారు కోరిన చోట బస్సులను ఆపాలని మంత్రి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. పరీక్ష కేంద్రాలకు సమయానికి చేరుకునేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే ఈరోజు నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవగా, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల రోజుల్లో అదనపు బస్సులు నడపడానికి RTC అధికారులు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
విద్యార్థుల సౌకర్యం దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఉపశమనం కలిగించనుంది.








