భీమవరం అడవి ప్రాంతంలో పులి అడుగుజాడలు గుర్తింపు – గ్రామస్తుల్లో ఆందోళన
పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలం టి.కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని భీమవరం అడవి ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టు ఆనవాళ్లు బయటపడ్డాయి. గ్రామానికి సమీపంలో ఉన్న కణితి ప్రసాద్ వ్యవసాయ పొలం వద్ద పులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
అడవికి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల్లో ఈ అడుగుజాడలు కనిపించడంతో స్థానిక గ్రామస్తుల్లో భయం, ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు.
పులి కదలికలపై నిరంతర నిఘా ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు రాత్రి సమయంలో అడవి ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, పశువులను సురక్షిత ప్రదేశాల్లో కట్టివేయాలని సూచించారు.
అవసరమైతే ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. ఎవరైనా పులి ఆనవాళ్లు గమనించినట్లయితే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు.









