నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
: జిల్లా ఆహార భద్రతాధికారి శరత్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చిన్న, పెద్ద ఆహార వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని కొంతమంది నకిలీ వ్యక్తులు ఫోన్ కాల్స్ ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు జిల్లా ఆహార భద్రత శాఖ దృష్టికి వచ్చినట్లు జిల్లా ఆహార భద్రతాధికారి శరత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక వ్యక్తి తనను **“ఫుడ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ నాయుడు”**గా పరిచయం చేసుకుంటూ మొబైల్ నంబర్ 8886397761 నుండి ఆహార వ్యాపారదారులకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నట్లు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఆ వ్యక్తికి ఆహార భద్రత శాఖతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలియజేశారు.
అందువల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ఆహార వ్యాపార సంస్థల యజమానులు ఇలాంటి ఫోన్ కాల్స్ను నమ్మవద్దని, ఫోన్, యూపీఐ లేదా నగదు రూపంలో ఎవరికి కూడా డబ్బులు చెల్లించవద్దని జిల్లా ఆహార భద్రత శాఖ సూచిస్తోంది. అధికారుల పేరుతో డబ్బులు అడగడం పూర్తిగా మోసంగా భావించాల్సిందిగా తెలిపారు.
ఆహార భద్రత శాఖకు సంబంధించిన లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు, ఫీజులు కేవలం అధికారిక విధానంలో మాత్రమే వసూలు చేయబడతాయని, వ్యక్తిగత ఫోన్ కాల్స్ ద్వారా ఎలాంటి చెల్లింపులు ఉండవని మరోసారి స్పష్టం చేశారు.
ఇలాంటి నకిలీ ఫోన్ కాల్స్ లేదా మోసపూరిత ప్రయత్నాలు ఎదురైనట్లయితే వెంటనే పాల్వంచలోని జిల్లా ఆహార భద్రత శాఖ ఐడీఓసీ కార్యాలయం (రూమ్ నెంబర్ F-3) వద్ద సమాచారం అందించాలని జిల్లా ఆహార భద్రతాధికారి శరత్ వ్యాపారదారులను కోరారు.









