ప్రతి క్షణం
ప్రజల పక్షం

  బుర్గంపాడు CHCలో తొలిసారి సిజేరియన్.. చరిత్ర సృష్టించిన వైద్యులు 3 కేజీల మగబిడ్డకు జన్మనిచ్చిన మమత.. తల్లి, బిడ్డ క్షేమం వైద్య బృందాన్ని అభినందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ పాటిల్

బుర్గంపాడు CHCలో తొలిసారి సిజేరియన్.. చరిత్ర సృష్టించిన వైద్యులు

3 కేజీల మగబిడ్డకు జన్మనిచ్చిన మమత.. తల్లి, బిడ్డ క్షేమం

వైద్య బృందాన్ని అభినందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ పాటిల్
బూర్గంపాడు,ఆధాబ్ న్యూస్:
బుర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి (CHC) చరిత్రలో తొలిసారిగా సిజేరియన్ (పెద్ద ఆపరేషన్) విజయవంతంగా నిర్వహించి వైద్యులు చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు బుర్గంపాడు పరిసర గ్రామాల ప్రజలు సిజేరియన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. తాజాగా స్థానికంగా ఈ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సారపాకకు చెందిన బానోత్ మమత (26) రెండో కాన్పు కోసం బుర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. పరీక్షించిన ప్రసూతి వైద్యురాలు డా. అనూష లక్ష్మి సిజేరియన్ ఆపరేషన్ చేసి 3 కేజీల మగబిడ్డకు పురుడుపోశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న ఈ ఆసుపత్రిని 2022లో వైద్య విధాన పరిషత్ (TVVP) పరిధిలోకి తీసుకుని 30 పడకల ఆసుపత్రిగా మార్చారు. అయితే 30 పడకలకు సరిపడా భవనం, మౌలిక వసతులు పూర్తిస్థాయిలో మంజూరు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచన మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆసుపత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆపరేషన్ థియేటర్‌కు కావలసిన పరికరాలను సమకూర్చారు.

జిల్లా ఆసుపత్రుల ప్రధాన సమన్వయ అధికారి డీసీహెచ్‌ఎస్ డా. రవి బాబు కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులను, ఇటీవలే ఒక ప్రసూతి వైద్యురాలిని నియమించారు. ఆసుపత్రిలో 24 గంటల వైద్య సదుపాయం, రక్త పరీక్షల యంత్రాలు, డెంటల్ పరికరాలు ఏర్పాటు చేయడంతో రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు.

ఇదే సమయంలో సుమారు రూ. 2 కోట్ల DMFT నిధులతో నూతన ఆసుపత్రి భవనం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆరునెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించిన నూతన భవనం పనులు వేగంగా సాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ముక్కంటేశ్వరావు మాట్లాడుతూ.. గత ఒక సంవత్సరం నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పుడు సిజేరియన్ సేవలు అందుబాటులోకి రావడంతో పరిసర గ్రామాల ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువయ్యాయని తెలిపారు. సేవలు మెరుగుపర్చడంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ పాటిల్ ప్రత్యేక దృష్టి పెట్టారని, డీసీహెచ్‌ఎస్ డా. రవి బాబు నిరంతర పర్యవేక్షణలో ఆసుపత్రి అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని చెప్పారు.

డీసీహెచ్‌ఎస్ డా. రవి బాబు మాట్లాడుతూ.. ఇటీవల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలను అభినందించారని తెలిపారు. జిల్లాలోని ఏడు TVVP ఆసుపత్రుల్లో ఆపరేషన్ థియేటర్ సేవలు, ప్రసూతి సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయ్యిందని పేర్కొన్నారు. బుర్గంపాడులో త్వరలో డయాలిసిస్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇకపై బుర్గంపాడు ప్రజలు సిజేరియన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.

ఈ సిజేరియన్ ఆపరేషన్‌లో డా. ముక్కంటేశ్వరావు, డా. అనూష లక్ష్మి, మత్తు డాక్టర్ డా. రామ్ ప్రసాద్, నర్సింగ్ సిబ్బంది రేవతి, కరుణశ్రీ, పద్మ, జ్యోతి, నర్సింహ, కవిత తదితరులు పాల్గొన్నారు. వైద్య బృందాన్ని ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు, ఎంపీ బలరాం నాయక్, TVVP రాష్ట్ర కమిషనర్ డా. అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, డీసీహెచ్‌ఎస్ డా. రవి బాబు అభినందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!