స్టాక్ ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58 కోట్లు కాజేసిన సైబర్ మోసగాళ్లు
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ నుంచి సైబర్ మోసగాళ్లు రూ.2.58 కోట్లు దోచుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం… స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే 500 శాతం లాభాలు వస్తాయని మోసగాళ్లు ఆశ చూపారు. వారి మాటలు నమ్మిన ఊర్మిళ 2025 డిసెంబరు 24 నుంచి 2026 జనవరి 5 వరకు 19 విడతలుగా మొత్తం రూ.2.58 కోట్లను వివిధ ఖాతాలకు బదిలీ చేశారు. ఇందుకోసం ఆమె తన వద్ద ఉన్న బంగారంతో పాటు భర్త వద్ద ఉన్న బంగారంపై కూడా రుణం తీసుకుని పెట్టుబడులుగా చెల్లింపులు చేసినట్లు సమాచారం.
తొలుత లాభాల పేరుతో కొన్ని మొత్తాలు వచ్చినప్పటికీ, అనంతరం డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసగాళ్లు తప్పించుకోవడంతో తనకు మోసం జరిగిందని ఆమె గ్రహించారు. దీంతో ఈ నెల జనవరి 6న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు… సంబంధిత బ్యాంక్ ఖాతాల ట్రాన్సాక్షన్లు, మొబైల్ నంబర్లు, వాట్సాప్ చాట్ డేటా ఆధారంగా మనీ ట్రైల్స్ను ట్రేస్ చేస్తూ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
సైబర్ క్రైమ్ అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ… అసాధారణ లాభాలు (500%, 300% వంటి హామీలు) ఇస్తామంటూ వచ్చే మెసేజ్లు, గ్రూప్ లింకులు, ట్రేడింగ్ యాప్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.









