అక్రిడిటేషన్, మీడియా కార్డులకు తేడా లేదు
డెస్క్ జర్నలిస్టులు ఆందోళన చెందొద్దు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
రాష్ట్రంలో అక్రిడిటేషన్ కార్డులు, మీడియా కార్డుల మధ్య ఎలాంటి తేడా లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా అక్రిడిటేషన్ కార్డు దారులకు వర్తించే అన్ని ప్రయోజనాలు మీడియా కార్డు దారులకు కూడా వర్తిస్తాయని తెలిపారు. ఈ విషయంలో డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, జీవో నంబర్ 252లో అవసరమైన మార్పులు చేసి లిఖితపూర్వకంగా అందజేస్తామని హామీ ఇచ్చారు.
మంగళవారం సచివాలయంలో తమను కలిసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్), డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులతో మంత్రి వివిధ అంశాలపై చర్చించారు. జర్నలిస్టుల సందేహాలను నివృత్తి చేస్తూ, కొందరు కావాలనే అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, వాటిని నమ్మవద్దని సూచించారు. జర్నలిస్టుల పట్ల ఎలాంటి పక్షపాతం లేదని, “మీతో నేనున్నాను, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని భరోసా ఇచ్చారు.
జర్నలిస్టులను రెండు విభాగాలుగా చూడాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని, అర్హులైన నిజమైన జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే అత్యధిక సంఖ్యలో అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే రాష్ట్రంలోని అన్ని జర్నలిస్టు సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, ఆ సమావేశానికి డెస్క్ జర్నలిస్టులను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. జర్నలిస్టుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించి జీవో 252లో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తామని, జర్నలిస్టులకు మరింత మేలు చేకూరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు బి. రాజశేఖర్, గండ్ర నవీన్ ఆధ్వర్యంలో ఫెడరేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు ఉపేందర్, మస్తాన్, నాయకులు నిస్సార్, విజయ్, రాజారాం పాల్గొన్నారు. స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ నాయకులు కృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.









