ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం డీటీసీగా పనిచేస్తూ రూ.200 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన కిషన్

ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం

డీటీసీగా పనిచేస్తూ రూ.200 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టిన కిషన్
మహబూబ్ నగర్,ఆధాబ్ న్యూస్:
మహబూబ్‌నగర్‌ జిల్లా రవాణాశాఖలో భారీ అవినీతి బయటపడింది. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ (డీటీసీ)గా విధులు నిర్వహిస్తున్న కిషన్ ఆదాయానికి మించిన అక్రమాస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గుర్తించింది. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేసి విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించింది.

ఏసీబీ అధికారులు 15 బృందాలుగా ఏర్పడి హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లోని మొత్తం 12 చోట్ల ఒకేసారి దాడులు చేశారు. కిషన్‌ ఇళ్లు, కార్యాలయాలు, బంధువులు, స్నేహితుల నివాసాలతో పాటు స్వగ్రామం నిజాంపేట మండలం బల్కంచల్క తండాలో సైతం సోదాలు నిర్వహించారు.

ఈ సోదాల్లో ఇప్పటివరకు రూ.12.72 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు లభ్యమయ్యాయి. అయితే బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏసీబీ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో అక్రమాస్తులు బయటపడటం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు.

సోదాల్లో నాటకీయ పరిణామాలు

మంగళవారం ఉదయం బోయిన్‌పల్లిలోని కిషన్‌ నివాసంలో సోదాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కిషన్‌ కొంతసేపు స్నానాల గదిలోనే ఉండిపోయినట్లు అధికారులు తెలిపారు. మొదట ఇంట్లో ఆస్తుల పత్రాలు లభించకపోవడంతో అనుమానంతో లోతుగా విచారణ చేపట్టగా, ఆయన సెల్‌ఫోన్‌లో బంగారు ఆభరణాలకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా సికింద్రాబాద్‌ పాట్‌మార్కెట్‌లోని ఓ బంగారు దుకాణం నుంచి కిలోకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే బంధువుల వద్ద దాచిన ఆస్తి పత్రాలను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది.

వందల కోట్ల ఆస్తుల జాబితా

ఏసీబీ దర్యాప్తులో కిషన్‌కు

సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 31 ఎకరాల వ్యవసాయ భూమి,

4 వేల గజాల్లో పాలీహౌజ్,

నిజామాబాద్‌లో 10 ఎకరాల వాణిజ్య స్థలం,

లహరి ఇంటర్నేషనల్‌ హోటల్‌లో 50 శాతం వాటా,

రాయల్‌ ఓక్ ఫర్నిచర్‌ షాప్‌లో ఓనర్‌షిప్‌,

అశోక టౌన్‌షిప్‌లో 2 ఫ్లాట్లు,

బ్యాంకు ఖాతాల్లో రూ.1.37 కోట్లు,

బ్యాంకు లాకర్లలో కిలోకు పైగా బంగారం,

రెండు విలాసవంతమైన కార్లు ఉన్నట్లు తేలింది.

1994 నుంచే అవినీతి ఆరోపణలు

1994లో అసిస్టెంట్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా రవాణాశాఖలో చేరిన కిషన్‌పై మొదటి నుంచే అవినీతి ఆరోపణలున్నట్లు అధికారులు తెలిపారు. బోధన్‌, నిజామాబాద్‌, మేడ్చల్‌, మెహిదీపట్నం ప్రాంతాల్లో పనిచేసిన సమయంలోనే అక్రమాస్తులు కూడబెట్టినట్లు తాజా సోదాల్లో వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితమే మహబూబ్‌నగర్‌ డీటీసీగా బాధ్యతలు చేపట్టారు.

ఏసీబీ కేసు – అరెస్ట్

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో కిషన్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

రవాణాశాఖలో అవినీతి రాజ్యం

గత 10 నెలల్లో ఇద్దరు జిల్లా స్థాయి రవాణాశాఖ అధికారులపై ఏసీబీ కేసులు నమోదు కావడం ఆ శాఖలో అవినీతి తీవ్రతను చాటుతోంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌, యాజమాన్య మార్పిడి వంటి ప్రతి పనికీ లంచాలు తప్పనిసరిగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లంచాలు డిమాండ్‌ చేసే ప్రభుత్వ అధికారులపై ప్రజలు ఏసీబీ వాట్సప్‌ నెంబర్‌ 9440446106కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!