ఫ్లాష్ న్యూస్ | రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
హైద్రాబాద్,ఆధాబ్ న్యూస్:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షానికి అద్భుతమైన ఫలితాలు రావడంతోనే తదుపరి ఎన్నికలకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం ప్రభుత్వానికి తెలియజేసినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఈ నెల చివరి వారంలో అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మంత్రి వర్గ విస్తరణ తరువాత ఎన్నికలా? లేక అంతకంటే ముందే ఎన్నికలకు వెళ్లాలా? అనే అంశంపై కేబినెట్లో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మంత్రి వర్గ విస్తరణలో ఇద్దరికి అవకాశం ఉండవచ్చని, కొన్ని శాఖల్లో చేర్పులు–మార్పులు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఏప్రిల్ నెలలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల హీట్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.









