సీఎం పర్యటన ఏర్పాట్లు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో, ఏర్పాట్ల పురోగతిని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సమయం దగ్గరపడుతున్నందున అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆయన ఆదేశించారు.
యూనివర్సిటీ ప్రాంగణంలోని ఆడిటోరియం, హాస్టల్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అంతర్గత రహదారులు, ముఖ్య ప్రవేశ ద్వారాలు వంటి ప్రదేశాలను కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి ఇంజనీరింగ్, యూనివర్సిటీ అధికారులతో పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఆలస్యానికి దారితీసే అంశాలు ఉంటే వెంటనే నివేదించాలని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
యూనివర్సిటీ వాతావరణాన్ని పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్, విభాగాలవారీగా ఎంపీడీవోలను నియమించారు. గ్రౌండ్ లెవెలింగ్, మొక్కల నాటకం, రోడ్ల పక్కన హార్టికల్చర్ పనులు, చెత్త తొలగింపు వంటి సుందరీకరణ కార్యక్రమాలను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన రోజున యూనివర్సిటీ ఒక ఆదర్శ విద్యాసంస్థగా కనిపించాలనే లక్ష్యంతో అన్ని పనులు నాణ్యతతో చేయాలని ఆయన స్పష్టం చేశారు.
విద్యుత్, నీరు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మీడియా స్టాళ్లు, వసతి సదుపాయాలు వంటి విభాగాలు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పర్యటన విజయవంతం కావాలంటే ప్రతి శాఖ సమిష్టిగా ముందుకు రావాలని, ఏర్పాట్లు ప్రభుత్వ ప్రతిష్ఠకు తగ్గట్టుగా ఉండాలని తెలిపారు.
పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ జగన్మోహన్ రాజు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డిపిఓ అనూష, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఎంపీడీవోలు, కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









