సిద్ధిపేట జిల్లాలో అనధికార మెడికల్ క్లినిక్స్పై కలెక్టర్ కీలక చర్య
లైసెన్సు లేని క్లినిక్స్ పై బహుళ విభాగాల కమిటీ ఏర్పాటు – వెంటనే అమల్లోకి ఆదేశాలు
సిద్ధిపేట, ఆధాబ్ న్యూస్:
జిల్లాలో అర్హతలు లేని వ్యక్తులు (క్వాక్స్) నిర్వహిస్తున్న అనధికార మెడికల్ క్లినిక్స్పై జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ కఠిన చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు పలు విభాగాలతో కూడిన కమిటీ ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
డీఎంహెచ్ఓ నివేదికలతో పాటు ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. RMP/PMPలుగా చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా:
అధిక శ్రేణి యాంటీబయోటిక్స్ మరియు మందులు ఇవ్వడం,
ప్రమాదకర వాతావరణంలో ఇంజెక్షన్లు, IV ఫ్లూయిడ్స్ ఇవ్వడం,
అనుమతులు లేకుండా ఇన్పేషెంట్ సదుపాయాలు నిర్వహించడం
వంటి కార్యకలాపాలు చేస్తున్నట్లు గుర్తించింది అధికారులు.
నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్, 2019 ప్రకారం రిజిస్ట్రేషన్ లేని వ్యక్తులు వైద్య సేవలు అందించడం నేరం. ఉల్లంఘనలకు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా ఐదు లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
కమిటీ సభ్యులు:
సంబంధిత తహసీల్దార్ – చైర్మన్
సంబంధిత SHO – సభ్యుడు
MPDO/మున్సిపల్ కమిషనర్ – సభ్యుడు
సంబంధిత PHC మెడికల్ ఆఫీసర్ – కన్వీనర్
అదనంగా డిప్యూటీ DM&HO, డ్రగ్ ఇన్స్పెక్టర్ అవసరమైనప్పుడు పాల్గొంటారు.
జిల్లా వ్యాప్తంగా అనధికార క్లినిక్స్ పై తనిఖీలు నిర్వహించి చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
జిల్లా ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం ఈ చర్యలను మరింత కఠినంగా అమలు చేయనుంది.









