మూడు దశాబ్దాల తర్వాత లొంగుబాటుకు సిద్ధమైన మావోయిస్టు నేత సాంబయ్య
ములుగు,ఆధాబ్ న్యూస్:
మావోయిస్టు నేత కొయ్యాడ సాంబయ్య అలియాస్ గోపన్న అలియాస్ ఆజాద్ లొంగిపోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా ఆయన లొంగుబాటు విషయంపై జరుగుతున్న ప్రచారాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. సాంబయ్య లొంగిపోతున్న విషయం కుటుంబసభ్యులతో కూడిన వర్గాలు నిర్ధారించాయి.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడాకు చెందిన సాంబయ్య మూడు దశాబ్దాలుగా అజ్ఞాతంలో జీవిస్తున్నారు. పలు కారణాల వల్ల ఆయన లొంగుబాటుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం దేశం నుండి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు సంకల్పబద్ధంగా చర్యలు తీసుకుంటోంది. మార్చి 31, 2026 నాటికి దేశంలో మావోయిజం పూర్తిగా అంతరించిపోతుందనే లక్ష్యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు పెద్దఎత్తున ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఎదురు తిరిగిన మావోయిస్టులను ఎన్కౌంటర్లలో ఏరిపారేస్తుండటంతో పాటు, లొంగుబాటు కానున్న వారికి పునరావాస మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో అనేక మంది మావోయిస్టులు లొంగిపోవడానికి ముందుకు వస్తున్నారు. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న సాంబయ్య లొంగుబాటు ప్రస్తుత పరిస్థితుల్లో కీలక పరిణామంగా మారింది.









