కామారెడ్డి కలెక్టరేట్లో నకిలీ ఐఏఎస్ హల్చల్
కామారెడ్డి,ఆధాబ్ న్యూస్: కలెక్టరేట్ కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం జరిగిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. “నేను ఐఏఎస్ అధికారి.. ఇంచార్జి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చాను” అంటూ నకిలీ ఉత్తర్వులు చూపిస్తూ ఒక మహిళ కలెక్టరేట్లో హంగామా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ నెల 2వ తేదీ నుండి సెలవులో ఉన్నారు. దీంతో ఇంచార్జి కలెక్టర్ బాధ్యతలు నిజామాబాద్ కలెక్టర్కు అప్పగించినట్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
అయితే, ఈ నెల 4వ తేదీ ఉదయం కారులో కామారెడ్డి కలెక్టరేట్ చేరుకున్న హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఇస్రత్ జహాన్ అనే మహిళ, తనను ఇంచార్జి కలెక్టర్గా నియమించారంటూ నకిలీ ఉత్తర్వులు చూపించింది. వెంటనే కలెక్టర్ ఛాంబర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆమెను అధికారులు ఆపారు. అనుమానంతో ఆమె చూపించిన పత్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్, ఉత్తర్వులను ప్రభుత్వం నుంచి ధృవీకరించాల్సి ఉంటుందని మహిళకు తెలిపారు.
అంతలో కొంతసేపు ఛాంబర్లో కూర్చొని ఉన్న ఆమె అక్కడినుంచి వెళ్లిపోయింది. దీనిపై అనుమానం వచ్చిన కలెక్టరేట్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాల దృశ్యాలను ఆధారంగా తీసుకుని, పోలీసులు తూప్రాన్ వద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో ఆమె 2020 నుండి గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుందని, ఇంకా ఉద్యోగం రాకపోవడంతో కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ ప్రయత్నం చేసిందని తెలిపింది. నకిలీ పత్రాలను తయారుచేసి ప్రభుత్వ అధికారిని మోసగించడానికి ప్రయత్నించినట్లు నిర్ధారించిన పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి మహిళను వదిలేశారు.
ఈ ఘటన జిల్లా పరిపాలన వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.









