తుంగతుర్తి ఎస్ఐ వేధింపులకు మహిళ ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో విషాదం
సూర్యాపేట,ఆధాబ్ న్యూస్:
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో జరిగిన దారుణ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తుంగతుర్తి ఎస్ఐ క్రాంతికుమార్ వేధింపులు తాళలేక ఓ వివాహిత మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే — వెంపటి గ్రామానికి చెందిన సోమనర్సమ్మ (50) అనే మహిళ తన బావ మల్లయ్య ఇంటిలో బంగారం పోయిందన్న అనుమానంతో ఇటీవల తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. గత 15 రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతుండగా, గురువారం రాత్రి వరకు సోమనర్సమ్మను స్టేషన్లో ఉంచి విచారించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతికుమార్ మహిళను తీవ్రంగా బెదిరించి, “నీ ఫింగర్ ప్రింట్స్ బంగారం దొంగతనంలో ఉన్నాయని, జైలుకు పంపిస్తాం” అంటూ అవమానకరంగా మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ అవమానభారం తాళలేక సోమనర్సమ్మ శుక్రవారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనతో వెంపటి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు, కుటుంబ సభ్యులు ఎస్ఐ క్రాంతికుమార్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జరగిన విషయంపై ఎస్ఐని వివరణ అడగగా, సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నట్లు సమాచారం.
గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు సోమనర్సమ్మ మరణానికి కారణమైన ఎస్ఐ క్రాంతికుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులను కోరుతున్నారు.









