రహదారులపై గుంతలు వెంటనే పూడ్చాలి – కలెక్టర్ జితేష్ వి. పాటిల్
రోడ్డు భద్రత మన అందరి బాధ్యత – జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం .” ఆధాబ్ న్యూస్ ఎఫెక్ట్ “
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 22 (ఆధాబ్ న్యూస్):
జిల్లా వ్యాప్తంగా రహదారులపై ఉన్న గుంతలను తక్షణమే పూడ్చాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. బుధవారం జిల్లా ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అధ్యక్షతన నిర్వహించబడింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “రహదారులపై గుంతలు పూడ్చే బాధ్యత ప్రతి శాఖపైనే ఉంటుంది. గ్రామపంచాయతీ సిబ్బంది గ్రావెల్ కట్టర్, వెట్ మిక్స్, మొబైల్ హాట్ మిక్స్ యూనిట్లు వినియోగించి రహదారులన్నీ గుంతలులేకుండా చేయాలి” అని సూచించారు. తదుపరి సమీక్షా సమావేశం నాటికి జిల్లాలోని ఎక్కడా గుంతలు లేకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లా పంచాయతీ అధికారి దీనిపై నిత్య పర్యవేక్షణ వహించాలని ఆదేశించారు.
భద్రాచలం పట్టణంలో రహదారులపై మార్కింగ్ లైన్లు వేయడంతో పాటు పాదచారుల పాత్వేలు ఏర్పాటు చేయాలని, పాత్వేపై దుకాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పాల్వంచ అంబేద్కర్ సెంటర్ వద్ద హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్, ఆర్ అండ్ బీ, వైద్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుశిక్షలు విధించేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన హెచ్చరించారు. తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా, మణుగూరులో గిరిజన యువకుల కోసం డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి వారికి శిక్షణతో పాటు లైసెన్సులు అందించే చర్యలు చేపట్టాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, కొత్తగూడెం పట్టణంలోని పాత బజార్, చిన్న బజార్ ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య అధికంగా ఉందని, ఈ సమస్యకు పరిష్కారం కోసం తగిన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, ఆర్ అండ్ బీ ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ ఈ.ఈ. శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి విజయలక్ష్మి, డీసీహెచ్ఓ రవిబాబు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.









