డ్రగ్స్ రహిత భద్రాద్రి కోసం చైతన్య కార్యక్రమం – మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పిలుపు మేరకు నవంబర్ 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన “చైతన్యం – డ్రగ్స్పై యుద్ధం” కార్యక్రమంలో భాగంగా మణుగూరు సబ్డివిజన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ — ప్రజలు కూడా డ్రగ్స్ నిర్మూలన యజ్ఞంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిషేధిత గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వ్యక్తుల గురించి ప్రజలు సమాచారాన్ని అందించాలన్నారు.
మణుగూరు సబ్డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సురక్షా బస్టాండ్, ఆర్టీసీ బస్సులు, పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులపై తనిఖీలు చేపట్టారు. ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా పరిశీలన జరిపి, అక్రమ మత్తు పదార్థాల రవాణాను అరికట్టే చర్యలు చేపట్టారు.
డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, “భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం మా లక్ష్యం. గంజాయి రవాణా లేదా విక్రయానికి పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తాం” అని హెచ్చరించారు.
యువత మత్తు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, కుటుంబాలు కూడా దీనిపై అవగాహన పెంపొందించాలని సూచించారు.
ఈ తనిఖీలలో ఏడూల్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై నగేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.









