అకాల వర్షంతో రైతుల కష్టానికి నీరాజనం – పద్మపురం రైతు అశోక్ వరి పంట నష్టపోయి తీవ్ర ఆవేదనలో
కరకగూడెం, అక్టోబర్ 22 (ఆధాబ్ న్యూస్): కరకగూడెం మండలంలోని పద్మపురం గ్రామ రైతు సాదు అశోక్ కష్టపడి సాగు చేసిన వరి పంట అకాల వర్షంతో పూర్తిగా నేలమట్టమైంది. రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా ఆయనకు చెందిన 10 ఎకరాల పొలం నీటమునిగి పంట మొత్తం దెబ్బతింది.
తన శ్రమతో, అప్పులు చేసి వేసిన పంట వర్షంలో నాశనం కావడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని అశోక్ బాధ వ్యక్తం చేశారు. “నోటి కాడికి వచ్చిన పంట వర్షం వల్ల పోయింది, మా కష్టానికి నీళ్లు పోసినట్లయింది” అంటూ ఆవేదన తెలిపారు.
మండలంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా వరి పొలాలు నీటమునిగినట్టు సమాచారం. ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి సాయం అందించాలని కోరుతున్నారు. పంట నష్టం పరిశీలించడానికి వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.









