ప్రభుత్వ టీచర్లకు బిగ్ షాక్..!
ఆఖరి ఆశలు గల్లంతు..!
న్యూఢిల్లీ, ఆధాబ్ న్యూస్:
దేశవ్యాప్తంగా ప్రభుత్వ టీచర్లకు పెద్ద దెబ్బ తగిలింది. టెట్ (Teacher Eligibility Test) నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రభుత్వ టీచర్ల అభ్యర్థనను జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (NCTE) పూర్తిగా తిరస్కరించింది. సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
దీంతో ఇప్పటికే సర్వీసులో ఉన్న లక్షలాది మంది ఉపాధ్యాయులు రెండేళ్లలో తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ టెట్ పాస్ కాకపోతే, ఉద్యోగాల నుంచి తొలగింపుకు గురవ్వాల్సిందేనని సుప్రీం గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
2017 పార్లమెంట్ తీర్మానం ప్రకారం ఐదేళ్లకు మించి సేవలో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని టీచర్లు ఆశించారు. అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో NCTE ఆ అభ్యర్థనను తిరస్కరించింది.
ఈ నిర్ణయంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగ భద్రతపై భయం వ్యక్తమవుతోంది. “ఇలా చేస్తే విద్యా వ్యవస్థలో తీవ్ర సంక్షోభం వస్తుంది. టీచర్లు బోధన కంటే టెట్ పరీక్షల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది” అని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
తమ ఉద్యోగాలను కాపాడుకోవడంలో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, విద్యార్థుల విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అన్ని ఊహాగానాలకు తెరదిస్తూ NCTE అధికారికంగా ఈ పిటిషన్ను కొట్టిపారేయడంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లయింది. కానీ ఉపాధ్యాయుల భవిష్యత్తు మాత్రం అనిశ్చితంగా మారింది.









