ఎన్నికల కోడ్ అమల్లో: రూ.50,000కి పైగా నగదు వెంట తీసుకెళ్లరాదు: ఎస్ఐ పీవీన్ రావు
కరకగూడెం, ఆధాబ్ న్యూస్ :తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కరకగూడెం మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ పీవీన్ రావు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. పెద్ద మొత్తంలో నగదు తమ వెంట తీసుకెళ్లకూడదని వారు సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్కో వ్యక్తి గరిష్టంగా రూ.50,000 మాత్రమే తీసుకొని వెళ్లాలి అని నిర్దిష్ట కారణాలు లేకుండా ఎక్కువ నగదు కలిగి ఉంటే, సరైన పత్రాలు లేని సందర్భంలో ఆ నగదును సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. తక్కువ మొత్తంలో దొరికిన నగదును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారని చెప్పారు.అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపార అవసరాలు, పెళ్లిళ్ల వంటి ముఖ్య కారణాల కోసం పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లే వారికి సంబంధిత రశీదులు, బ్యాంక్ స్టేట్మెంట్లు వంటి పత్రాలు దగ్గర ఉంచాలని సూచించారు. తనిఖీల సమయంలో పత్రాలు చూపిస్తే, విచారణ తర్వాత నగదును విడుదల చేస్తారని తెలిపారు.
అంతేకాక, షాపింగ్ లేదా ఇతర లావాదేవీలకు వెళ్ళేటప్పుడు సరైన బిల్లులు, పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాలని పీవీన్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.









