విలేజ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమం అమలులో భాగంగా జిల్లాలోని గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం విలేజ్ యాక్షన్ ప్లాన్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
సోమవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్, జిల్లా వ్యాప్తంగా ఆది కర్మయోగి కార్యక్రమం క్రింద ఉన్న 130 గ్రామ పంచాయతీలలో విలేజ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం అత్యవసరమని స్పష్టంచేశారు.
గ్రామాల అభివృద్ధి కోసం బోర్వెల్ మరమ్మతులు, కొత్త బోర్వెల్లు, రోడ్లు, వాటర్ ట్యాంకులు, విద్యుత్ సదుపాయాలు, వ్యవసాయ ఆధునికీకరణ, డ్రోన్ల వినియోగం, ట్రాక్టర్లు, వాటర్ సెట్స్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, విద్యార్థుల కోసం డైనింగ్ హాల్స్, వైద్య సౌకర్యాలు, గ్రామాలలో పంట విస్తీర్ణం వివరాలు వంటి అంశాలను చేర్చి నివేదికలు సమర్పించాలని సూచించారు.
అలాగే సెప్టెంబర్ 30వ తేదీలోగా అన్ని గ్రామ పంచాయతీలలో ఆదిశేవా కేంద్రాలను ప్రారంభించాలి అని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం విలేజ్ యాక్షన్ ప్లాన్ను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను ఐటీడీఏ పీవో రాహుల్ పర్యవేక్షించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అక్టోబర్ 2న ఆది కర్మయోగి అభియాన్ అమలవుతున్న అన్ని 130 గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించాలి. ఆ గ్రామసభలలో ప్రజల అవసరాలు, అభివృద్ధి సూచనలు, కార్యాచరణలపై చర్చించి వాటిని ప్రణాళికల్లో ప్రతిబింబింపజేయాలని ఆయన సూచించారు.
గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం సంబంధిత శాఖలు పరస్పర సమన్వయం కలిగి, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, సమయపాలనతో కార్యక్రమాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశాలు జారీచేశారు.









