తెలంగాణ అండర్-15 మహిళ క్రికెట్ ప్రాబబుల్స్ జట్టుకు తాటిగూడెం బాలిక ఎంపిక
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామానికి చెందిన రామటెంకి దేవి ప్రియ తెలంగాణ అండర్-15 మహిళ క్రికెట్ ప్రాబబుల్స్ జట్టులో చోటు దక్కించుకుంది.
చదువుతో పాటు క్రికెట్లో ప్రతిభ చూపిన దేవి ప్రియ ఎంపిక కావడంతో తల్లిదండ్రులు హనుమంతరావు, ఉమామహేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తండ్రి హనుమంతరావుకు క్రికెట్పై ప్రత్యేకమైన ఆసక్తి ఉండగా, ఆ అభిరుచిని తన కూతురి ద్వారా సాకారం చేయాలని భావించి ప్రోత్సహించారు. ఆయన సహకారంతో హైదరాబాద్లో జరిగిన మహిళా క్రికెట్ అండర్-15 సెలక్షన్లో దేవి ప్రియ ప్రతిభ కనబరచి ఎంపికైంది.
దేవి ప్రియ ఎంపికపై హెడ్ కోచ్ సురేందర్ రెడ్డి, కోచ్లు వెంకట్ యాదవ్, బుచ్చిబాబు, రంజీ కోచ్ ఇర్ఫాన్ అభినందనలు తెలిపారు. కరకగూడెం మండలానికి, తెలంగాణకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు.
మారుమూల గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక కావడం పట్ల భద్రాద్రి జిల్లా క్రికెట్ సంఘాలు, గ్రామస్తులు, రాజకీయ నాయకులు దేవి ప్రియను అభినందించారు.









