ప్రతి క్షణం
ప్రజల పక్షం

  జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలి: కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెంజిల్లా వ్యాప్తంగా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. సోమవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను ప్రతీ పట్టణం, మండల కేంద్రం, గ్రామాల్లో ఘనంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

సద్దుల బతుకమ్మ కోసం తగిన ప్రదేశాలను గుర్తించి, లైటింగ్, సౌండ్ సిస్టమ్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు ముందుగానే సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొనేందున భద్రతా చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.

బతుకమ్మ నిమజ్జనాల సమయంలో ప్రమాదాలు జరుగకుండా ఇరిగేషన్ శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైతే రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ శాఖ సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేసి, రెస్క్యూ టీంలను అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు.

వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లు, అత్యవసర ఔషధాలను వేడుకల ప్రాంగణాల్లో సిద్ధం ఉంచాలని ఆరోగ్య శాఖకు సూచించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగను ఉత్సాహంగా జరుపుకునేలా ప్రతి శాఖ కట్టుదిట్టమైన సమన్వయం చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మ ప్రత్యేక గుర్తింపు పొందిందని గుర్తుచేసిన కలెక్టర్, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. శుభ్రత, భద్రత, సాంప్రదాయ పరిరక్షణపై దృష్టి పెట్టి జిల్లా మొత్తం పండుగ వాతావరణంలో కళకళలాడేలా చూడాలని ఆయన సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!