మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క పర్యటన
ములుగు,ఆధాబ్ న్యూస్:
ములుగు జిల్లా మేడారం మహా జాతర ఏర్పాట్లను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ములుగు ఎస్పీ శబరిష్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క హోదాను పక్కనపెట్టి బైక్ పై మేడారం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. రాబోయే జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రహదారుల పరిస్థితిని పరిశీలించి, ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించాలంటూ సూచనలు చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన ప్రత్యేక మార్గాలపై మంత్రి పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రముఖుల రాకపోకల వల్ల భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జాతర ప్రాంతంలో వాహనాల కదలిక, పార్కింగ్ సదుపాయాలు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సమగ్ర ప్రణాళికతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
హోదాను పక్కనపెట్టి ఎస్పీ బైక్ పై ప్రయాణిస్తూ ఏర్పాట్లను పరిశీలించిన సీతక్కను చూసి స్థానికులు “జై సీతక్క” అంటూ నినాదాలు చేశారు.









