స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని రేగా కాంతారావు పిలుపు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని, సెప్టెంబర్ 10, 11 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గురువారం కరకగూడెం మండలంలోని స్పందన గార్డెన్లో కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల మూడు మండలాల బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేగా కాంతారావు మాట్లాడుతూ… ఆరు హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను అభివృద్ధి కార్యక్రమాలు గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు పేర్లతో ప్రజలను ఆశపెడుతున్నారని, ఇలాంటి నాటకాలపై నమ్మకం పెట్టుకోవద్దని పిలుపునిచ్చారు.
రైతుల పండించే పంటలకు సకాలంలో ఎరువులు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులను కళ్లల్లో పెట్టి చూసుకున్నారని గుర్తుచేశారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ తమ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిపించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని రేగా కాంతారావు పిలుపునిచ్చారు.
అనంతరం కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీని వీడి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసిలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్లు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









