భద్రాచలంలో గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక
భద్రాచలం,ఆధాబ్ న్యూస్ ఆగస్టు 29 :
గోదావరి నది ఉధృతి పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం 7 గంటల 22 నిమిషాలకు భద్రాచలం వద్ద నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ప్రస్తుతం గోదావరి నుంచి తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల రెండువందల ఎనభై ఎనిమిది క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పరిస్థితులను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని కలెక్టర్ తెలిపారు.
ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, పునరావాస కేంద్రాలకు తరలించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ప్రజలు రక్షణ చర్యల్లో సహకరించాలని, అధికారులు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర సహాయం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ గదుల నంబర్లకు సంప్రదించాలని సూచించారు









