రైతులందరికీ సరిపడా యూరియా సరఫరా చేయాలి – పినపాకలో సిపిఐ ధర్నా
పినపాక ,ఆధాబ్ న్యూస్:
రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో గురువారం పినపాక మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు.
మిర్చి, వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు వంటి పంటలకు యూరియా సరఫరా సకాలంలో లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు చేసి సాగు ప్రారంభించిన రైతులకు యూరియా అందకపోవడం వల్ల దిగుబడి తగ్గి, భారీ స్థాయిలో నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని వారు తెలిపారు.
రాష్ట్రానికి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని విమర్శించారు. దీంతో రాష్ట్రంలో యూరియా కొరత ప్రమాదకర స్థాయికి చేరిందని పేర్కొన్నారు.
యూరియా పంపిణీలో అవినీతి, దళారీ వ్యవస్థను అరికట్టి ప్రతి రైతుకు సమానంగా ఎరువులు చేరేలా చూడాలని, పూర్తి సబ్సిడీతో ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాలు అందించాలని ఏఐకెఎస్ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు వినతిపత్రం అందజేశామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గడ్డం మనోహర చారి, తోగటి కుమార్, పత్తిపాటి నాగేశ్వరరావు, పద్మనాభ రాజు, గడ్డం వెంకటాచారి, మన్యం ఐలయ్య, వర్స నరసింహారావు, గురజాల సుబ్రహ్మణ్యం, రమణాచారి, తంగేళ్లపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.









