ఉమేష్ చంద్ర నగర్ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలి: సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ డిమాండ్
పినపాక, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టీ.కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఉమేష్ చంద్ర నగర్ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం ప్రజాపంథా ప్రతినిధి బృందం గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో సమావేశమయ్యింది. ఈ సందర్భంగా వారు గ్రామంలో మౌలిక వసతుల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు.
“గ్రామానికి సరైన రహదారి లేకుండా, ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ గర్భిణీ స్త్రీని హాస్పిటల్కి తీసుకెళ్లే సమయంలో, వాహనాలు రాకపోవడంతో మంచానికి జట్టి కట్టి రెడ్డిగూడెం వరకు మోసుకెళ్లాల్సి వచ్చింది. అటుపైనే వాహనంలో తరలించగలిగాం,” అని మధుసూదన్ రెడ్డి తెలిపారు.
అత్యవసర వైద్యం, విద్య, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు లేక గ్రామస్థులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని, 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ కొన్ని ఏజెన్సీ గ్రామాలు కనీస సదుపాయాలకు నోచుకోకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలంటూ ప్రజాపంథా పార్టీ డిమాండ్ చేసింది.









