బీఎల్ఓలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: రాష్ట్రంలోని బూత్ స్థాయి అధికారులకు (బీఎల్ఓ) గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రక్రియను ఈ నెల 25వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఈఓ, ఎన్నికల నిర్వహణలో కీలకమైన పలు అంశాలపై సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల సంఖ్య 1200కి మించి ఉన్న చోట్ల కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో 1500 మంది వరకు ఓటర్లు ఉన్నచోట ఒక్క పోలింగ్ బూత్ ఉండేదని, ప్రస్తుతం ఓటర్లకు మరింత సౌలభ్యం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొత్తగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల జాబితాను ఈ నెల 20వ తేదీ లోపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.
అంతేగాక, అవసరమైన చోట కొత్త బూత్ లెవెల్ అధికారులను నియమించాలని సూచించారు. వీరు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండాలని, వారు అందుబాటులో లేని పక్షంలో అంగన్వాడీ కార్యకర్తలను బీఎల్ఓలుగా నియమించవచ్చని తెలిపారు.
ఎస్ఎస్ఆర్-2026 ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ నెల 15వ తేదీ లోపు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.









