చనువిచ్చింది కదా? అని పులితో ఆడుకుంటే వేటాడేస్తది!
థాయిలాండ్లో రీల్స్ కోసం అతి చేసిన యువకుడిపై పులి దాడి – గాయాలతో బయటపడిన వ్యక్తి
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
పులి చనువిచ్చింది కదా అని అతి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సోషల్ మీడియా ప్రభావంతో వన్యప్రాణులతో ఫోటోలు, రీల్స్ తీసుకోవడం ట్రెండ్గా మారింది. కానీ, అది ఎప్పుడైనా ప్రాణాలకు ప్రమాదకరంగా మారవచ్చు. తాజా ఘటన థాయిలాండ్లోని ఓ జూ పార్కులో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, ఓ యువకుడు పెద్దపులితో కలిసి రీల్ తీయాలని ప్రయత్నించాడు. చైన్తో పులిని పట్టుకుని నడుస్తూ వచ్చాడు. ఆపై దాని పక్కన కూర్చున్నాడు. ఇంతవరకూ అందరూ బాగానే ఉందని భావించారు. కానీ, అకస్మాత్తుగా జూపార్క్ సిబ్బందిలోని మరో వ్యక్తి పులిని కర్రతో కొట్టడంతో, అది ఆగ్రహంతో యువకుడిపై దాడికి దిగింది.
ప్రాణభయంతో యువకుడు కేకలు వేయగా, పక్కన ఉన్న మరో వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనలో యువకుడు గాయాలతో బయటపడినట్టు సమాచారం.
ఈ వీడియోపై నెటిజన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు. “చనువిచ్చింది కదా? అని పులితో ఆడుకుంటే వేటాడేస్తది!” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, “పులిని దూరంగా ఉండి చూసుకోవచ్చు. ఫొటో దిగడమే సరిపోతుంది. కానీ ఆడుకోవాలని చూస్తే, ప్రమాదం తప్పదు” అంటూ హెచ్చరిస్తున్నారు.
ఈ ఘటన వన్యప్రాణుల పట్ల మానవుల ప్రవర్తనపై మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. తమ ప్రయోజనాల కోసం జంతువులను ఉక్కిరిబిక్కిరి చేయడం మానవత్వానికి విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు.









