పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ సతీమణికి ప్రసవం – ప్రభుత్వ వైద్యంలో నమ్మకానికి నిదర్శనం
పాల్వంచ,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ జీతేష్ వి పాటిల్ పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గర్భధారణ ప్రారంభం నుంచి నియమితంగా పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకుంటూ, ప్రభుత్వ వైద్యం పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించారు. కార్పొరేట్ ఆసుపత్రులు లేదా ప్రైవేటు వైద్య సేవల్ని ఆశ్రయించకుండా ప్రభుత్వ సీహెచ్సీ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించుకోవడం ప్రభుత్వ వైద్య రంగానికి విశ్వాసాన్ని చాటి చెబుతోంది.
ఈ ప్రసవానికి డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు నేతృత్వంలో ఉన్న వైద్య బృందం పూర్తి పర్యవేక్షణ వహించింది. కలెక్టర్ దంపతుల ఈ నిర్ణయం ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకాన్ని మరింతగా పెంచుతుందని వైద్య అధికారులు అభిప్రాయపడ్డారు.
ఈ సంఘటన ప్రభుత్వ వైద్యం బలోపేతానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.









