నిధులు కేటాయించాలని టిడిపి నాయకుడు చందా మధు డిమాండ్.
కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో పారిశుద్ధ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఎక్కడ చెత్త ఉంటే అక్కడే డంపింగ్ యార్డులుగా మారిపోయాయి. గతంలో గ్రామపంచాయతీ సర్పంచుల పదవీకాలంలో ఇంటింటికీ ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించడం జరుగుతుండగా, ప్రస్తుతం సర్పంచ్ పదవి కాలం ముగిసిన కారణంగా పారిశుధ్యం పూర్తిగా అదుపుతప్పింది.
గ్రామస్తులే ఇప్పుడు స్వయంగా చెత్తను తొలగించుకునే పరిస్థితి ఏర్పడింది. అధికారులు మరియు ప్రభుత్వం తగిన నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రజల సమస్యలు ముదిరిపోయాయి. ప్రధానంగా వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున, శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పినపాక నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకుడు చందా మధు స్పందించారు. ప్రతి గ్రామపంచాయతీకి తగిన నిధులు కేటాయించి, కరెంట్ బల్బులు, బ్లీచింగ్ పౌడర్ వంటి అవసరాలను తీర్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే, ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి ఏర్పడుతుందన్న హెచ్చరికను ఆయన ఇచ్చారు.









