తాటి చెట్టుపై నుండి పడిన కల్లు గీత కార్మికుడు తీవ్ర గాయాలతో ఖమ్మం ఆసుపత్రికి తరలింపు
ఖమ్మం, ఆధాబ్ న్యూస్:
కూసుమంచికి చెందిన కల్లు గీత కార్మికుడు మంద వెంకన్న గౌడ్ (60) తాటి చెట్టు నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం మధ్యాహ్నం కూసుమంచి తాటి వనంలో చోటుచేసుకుంది.
వెంకన్న గౌడ్ గత నాలుగు దశాబ్దాలుగా కల్లు గీత కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగా మే 24న తాటి చెట్టు ఎక్కి కల్లు గీసిన అనంతరం దిగుతుండగా అచేతనంగా కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని నడుము, తల, చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.
పరిసర ప్రజలు వెంటనే స్పందించి 108 అంబులెన్స్కు సమాచారం అందించి, గాయపడ్డ వెంకన్నను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి అత్యవసర వైద్యం అందిస్తున్నారు.
DCHS డాక్టర్ రాజశేఖర్ గౌడ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ వెంకన్నకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఘటనపై ఆ గ్రామానికి చెందిన గౌడ సంఘ నాయకులు ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు పోలీసులకు ఫిర్యాదు చేశారు.









