స్కూల్ బస్సుల భద్రతపై అవగాహన కల్పించిన భద్రాచలం MVI వి.పుల్లయ్య
కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు.
భద్రాచలం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో స్కూల్ బస్సుల భద్రత, ఫిట్నెస్ అంశాలపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంగం వెంకటపుల్లయ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జూన్లో స్కూల్స్, కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డ్రైవర్లకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యంగా ఉంది.
ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ, “స్కూల్ బస్సులు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫిట్నెస్ సర్టిఫికేట్ సమయానికి తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. మద్యపానం, సెల్ఫోన్ వాడకాన్ని పూర్తిగా నివారించాలి. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలి,” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మణుగూరు ప్రాంతానికి చెందిన సామాజిక సేవకులు కర్నే బాబురావు మాట్లాడుతూ, “ఇలాంటి అవగాహన కార్యక్రమాలు స్కూల్ పిల్లల భద్రతకు కీలకం. ఈ కార్యక్రమం నిర్వహించిన పుల్లయ్య గారికి కృతజ్ఞతలు. అంతేకాదు, డ్రైవర్లకు, క్లీనర్లకు చట్టబద్ధంగా వేతనాలు, సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చొరవ చూపాలి,” అని అభిప్రాయపడ్డారు.
అవగాహన కార్యక్రమానికి పలువురు డ్రైవర్లు, స్కూల్ యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు. స్కూల్ బస్సుల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.









