ఏళ్ల నాటి కల సాకారం.. సూర్యాపేటకు హైస్పీడ్ రైలు: ఒకటి కాదు రెండు లైన్లు
సూర్యాపేట,మే 22 ఆధాబ్ న్యూస్:
సూర్యాపేట ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే క్షణాలు సమీపిస్తున్నాయి. కేంద్ర రైల్వే శాఖ పెద్ద ప్రకటన చేస్తూ, సూర్యాపేట మీదుగా రెండు కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కేవలం సాధారణ రైల్వే లైన్లు మాత్రమే కాకుండా, ఒకటి అత్యాధునిక హైస్పీడ్ రైల్వే కారిడార్ కావడం విశేషం.
హైస్పీడ్ రైలు మార్గం శంషాబాద్ నుంచి విశాఖపట్నం వరకు ప్రతిపాదిత రూట్లో సూర్యాపేట, నల్లగొండ ప్రాంతాలు ముఖ్యమైన భాగాలుగా గుర్తించబడ్డాయి. ఈ రూట్ కోసం ఇటీవల ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) చేపట్టబడింది. దీనిలో భాగంగా కేంద్రం రూ.4.71 కోట్లు కేటాయించింది. ఈ మార్గంలో నడిచే రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తనున్నాయి.
ఇదే సమయంలో మరో రైల్వే ప్రాజెక్టు – డోర్నకల్ నుండి గద్వాల వరకు కొత్త రైలు లైన్కు కూడా ఆమోదం లభించింది. 296 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం సూర్యాపేట, నల్లగొండ, నాగర్కర్నూల్, వనపర్తి మీదుగా సాగనుంది. ఈ ప్రాజెక్ట్కు కేంద్రం రూ.7.40 కోట్లు విడుదల చేసింది.
పలు దశాబ్దాలుగా రైల్వే కనెక్టివిటీ కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు ఇది ఊరట కలిగించే వార్త. గతంలో ఎన్నోసార్లు ప్రతిపాదించినా కేవలం పత్రాలకే పరిమితమైన రైల్వే ప్రాజెక్టులు ఇప్పుడు కార్యరూపం దాల్చనున్నాయి.
ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ప్రాజెక్టులకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. రైల్వే శాఖ విడుదల చేసిన తాజా పింక్ బుక్లో ఈ వివరాలు అధికారికంగా పొందుపరచబడ్డాయి.
ఇలాంటి కీలక ప్రాజెక్టులతో సూర్యాపేట రైలు మార్గంలో ఓ ప్రధాన కేంద్రంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల ఎన్నేళ్ల కలలు నెరవేరే దిశగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు అభివృద్ధికి గట్టి బలంగా నిలుస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.









