జూన్లోనే మూడు నెలల రేషన్ పంపిణీకి కేంద్రం ఆదేశాలు – రాష్ట్రంలో 5.25 లక్షల టన్నుల సన్నబియ్యం అవసరం.
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ కోటాను ముందుగానే అందించాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రవాణా, నిల్వలో తలెత్తే సమస్యలు, వరదల కారణంగా ఆహార ధాన్యాల సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై అధికారులకు లేఖ రాశారు. మే 31 లోపు మూడు నెలల రేషన్ను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ముందుగానే బియ్యం లిఫ్టింగ్ను వేగవంతం చేయాలని, ఎఫ్సీఐ గోదాముల్లో తగినంత నిల్వలు ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో మే నెల రేషన్ పంపిణీ పూర్తయ్యే దశలో ఉండగా.. తర్వలోనే మూడు నెలల కోటాకు అవసరమైన 5.25 లక్షల టన్నుల సన్నబియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. ఈ పరిమాణంలో బియ్యం అందుబాటులో ఉండేలా మిల్లర్లకు మిల్లింగ్ ప్రక్రియను స్పీడ్అప్ చేయాలని ఇప్పటికే సూచనలు జారీ అయ్యాయి.
రాబోయే రోజుల్లో రాష్ట్ర సివిల్ సప్లై శాఖ ముందస్తు ప్రణాళికతో పనులు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వర్షాకాలం సందర్భంగా రేషన్ సరఫరాలో ఆటంకం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు రంగంలోకి దిగారు.









