భద్రాద్రి జిల్లా టాపర్గా పోలెబోయిన అభిఘ్న శ్రీ — మంత్రి సీతక్క ఘన సన్మానం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
తాటిగూడెం గ్రామానికి చెందిన అభిఘ్న శ్రీ 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాపర్గా నిలిచింది. కరకగూడెం మండలానికి చెందిన ఆదివాసి జేఏసీ అధ్యక్షుడు పోలేబోయిన వెంకట్ నారాయణ, నాగరాణి దంపతుల కుమార్తె అయిన అభిఘ్న శ్రీ, సత్తుపల్లి మండలంలోని గండుగులపల్లి గ్రామంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (EMRS) లో చదువుతోంది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు, అభిఘ్న శ్రీ ప్రత్యేకంగా హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలోని ఆదివాసి భవన్లో సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. జిల్లా స్థాయిలో టాపర్గా నిలిచిన అభిఘ్నను మంత్రి సీతక్క అభినందిస్తూ, “అభిఘ్న శ్రీ లాంటి విద్యార్థినులు ఇతర యువతకు ప్రేరణగా నిలుస్తారు,” అని పేర్కొన్నారు.
అభిఘ్న శ్రీ ఈ విజయంతో తల్లిదండ్రులకే కాదు, గ్రామానికి, పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. పాఠశాల సిబ్బంది, స్థానిక ప్రజలు అభిఘ్నను అభినందిస్తున్నారు.









