ప్రమాదాల నివారణకు ఖాకీ యూనిఫామ్, డ్రైవర్లకు చట్టబద్ధ హక్కులు కోరుతూ వినతి
భద్రాద్రి కొత్తగూడెం ,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో విద్యార్థులను పరిమితికి మించి ఎక్కించకుండా చర్యలు తీసుకోవాలని, డ్రైవర్లకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని కోరుతూ సామాజిక సేవకులు కర్నే బాబురావు జిల్లా రవాణా శాఖ అధికారి సంగం వెంకట పుల్లయ్యకు వినతిపత్రాన్ని అందజేశారు.
భద్రాచలంలోని ఆర్టీవో కార్యాలయంలో కలసిన బాబురావు, పుల్లయ్యకు శాలువా కప్పి సత్కరించి తమ అభినందనలు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాలోని అనేక ప్రైవేట్ స్కూల్ బస్సులు నియమాలను అతిక్రమించి విద్యార్థులను అధిక సంఖ్యలో తీసుకుపోతున్నారని, ఇది ప్రమాదాలకు కారణమవుతోందని పేర్కొన్నారు.
బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్ తదితరాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బస్సులు నడుస్తున్నాయో లేదో తనిఖీలు జరపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, డ్రైవర్లకు సరైన శిక్షణ, డ్రైవింగ్ స్కిల్స్, చట్టబద్ధమైన లైసెన్స్ ఉన్నవారినే నియమించాలని సూచించారు.
సెల్ఫోన్ వాడకంతో కూడిన రాష్ డ్రైవింగ్ని నిరోధించాల్సిన అవసరం ఉందని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని బాబురావు తెలిపారు. ప్రతి డ్రైవరుకు రెండు జతల ఖాకీ యూనిఫాంలు, బూట్లు ఇవ్వాలని, డ్రైవర్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యాలను ఆదేశించాలని ఆయన కోరారు.









