ములుగు జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు, భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం: ఎస్పీ శభరీష్
ములుగు జిల్లా, ఆధాబ్ న్యూస్: ములుగు జిల్లాలో మావోయిస్టులపై పోలీసులు మరోసారి భారీ విజయాన్ని నమోదు చేశారు. జిల్లాలో సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 20 మంది సభ్యులను అరెస్ట్ చేయగా, మరో 8 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ములుగు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శభరీష్ వెల్లడించారు.
శనివారం మీడియాతో మాట్లాడిన ఎస్పీ శభరీష్, నక్సల్స్తో సంబంధం ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకుని విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఆపరేషన్లో మావోయిస్టుల వద్ద నుండి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు, కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
లొంగుబాటైన మావోయిస్టులు గతంలో వివిధ ఉద్యమాలకు పాల్పడ్డట్లు గుర్తించబడినట్టు సమాచారం. వారు ప్రభుత్వ పునరావాస పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ శభరీష్ సూచించారు. అరెస్ట్ చేసిన 20 మందిపై ఇప్పటికే వివిధ కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
ఈ చర్యలతో జిల్లాలో శాంతి భద్రతలు మరింత బలోపేతం కావడం ఖాయం అని ఎస్పీ తెలిపారు. మావోయిస్టు శృంఖల విస్తరణను అడ్డుకునేందుకు పోలీసులు చేపడుతున్న కృషి నేపథ్యంలో ఈ అరెస్టులు, లొంగుబాట్లు గణనీయమైన విజయంగా భావిస్తున్నారు.









