వట్టి వాగు ప్రాజెక్టును పరిశీలించిన గిరిజన అభ్యుదయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్కే దొర
కరకగూడెం,మే 10,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలంలోని రేగుళ్ల గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న వట్టి వాగు ప్రాజెక్టును గిరిజన అభ్యుదయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు గొగ్గలి ఆర్కే దొర శనివారం సందర్శించారు. ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగుతున్నట్టు గుర్తించిన ఆయన, పనులు వేగవంతంగా పూర్తిచేయాల్సిన అవసరం ఉందని అధికారులను కోరారు.
ప్రాజెక్టు ప్రగతిపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, పనివర్గాలతో మాట్లాడిన ఆర్కే దొర, ప్రజల నష్టాలు తగ్గించేందుకు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అనంతరం ఆయన స్థానిక రైతులతో సమావేశమై మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు పూర్తైతే బీడుబారిన భూములు సస్యశ్యామలంగా మారే అవకాశం ఉందని, ఇది రైతులకు పెద్ద ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో గిరిజన అభ్యుదయ సంఘం మండల అధ్యక్షులు కొమరం శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి గొగ్గలి కృష్ణ, ఉపాధ్యక్షులు గొగ్గలి సతీష్, ఇతర సంఘ నాయకులు, రైతులు పాల్గొన్నారు.









