సీపీఐ కృషితో జానంపేటకు మళ్లీ ‘108’ అంబులెన్స్
– సీపీఐ మండల కార్యదర్శి తోగటి కుమార్
పినపాక, జూలై 2 (ఆధాబ్ న్యూస్): జానంపేట, పరిసర ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు గతంలో కేటాయించిన ‘108’ అంబులెన్స్ను మణుగూరుకు తరలించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీపీఐ మండల కార్యదర్శి తోగటి కుమార్ తెలిపారు. ఈ సమస్యపై సీపీఐ నిరంతరంగా చేపట్టిన పోరాటాలు ఫలించి, ‘108’ అంబులెన్స్ను తిరిగి జానంపేటకు కేటాయించినట్లు ఆయన హర్షం వ్యక్తం చేశారు.
జానంపేట నుంచి తరలించిన ‘108’ అంబులెన్స్ను తిరిగి ఇక్కడికే రప్పించాలని సీపీఐ ఆధ్వర్యంలో పలు ఆందోళనలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఈ విషయంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా ప్రత్యేక చొరవ తీసుకుని డీఎంహెచ్ఓ, జిల్లా కలెక్టర్లతో మాట్లాడి జానంపేట ప్రజల సమస్యలను వివరించి, అంబులెన్స్ను పునరుద్ధరించాలని కోరినట్లు చెప్పారు.
నాయకుల చొరవ, సీపీఐ శ్రేణుల నిరంతర కృషి ఫలితంగా గురువారం జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) తిరిగి ‘108’ అంబులెన్స్ను కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని తోగటి కుమార్ తెలిపారు.
జానంపేట, పరిసర గ్రామాల ప్రజల తరఫున ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సాబీర్ పాషా, జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఓ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.








