పిడుగు బారినపడి మరణించిన అనిపెద్ది లలిత కుటుంబానికి ఐదు లక్షల చెక్కు అందజేత.
పినపాక ,ఆధాబ్ న్యూస్ :
పినపాక మండలం గొట్టెల గ్రామంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, పిడుగు పడి మరణించిన అనిపెద్ది లలిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ చెక్కును స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు స్వయంగా కుటుంబ సభ్యులకు అందజేశారు.
గమనించవలసిన విషయం ఏమిటంటే, 2017లో లలిత పొలంలో వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న సమయంలో పిడుగు పడటంతో ప్రాణాలు కోల్పోయింది. అప్పట్లోనూ పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ప్రభుత్వానికి విన్నవించారు. అనేక ప్రయత్నాల తరువాత ప్రస్తుతం ఆర్థిక సాయం మంజూరు కావడంతో, అదే ఎమ్మెల్యే చేతులమీదుగా చెక్కు అందుకోవడం లలిత కుటుంబానికి భావోద్వేగానికి కారణమైంది.
ఈ సందర్భంగా లలిత కుటుంబ సభ్యులు పాయం వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పినపాక ఎమ్మార్వో అద్దంకి నరేష్, ఎంపీడీవో సునీల్ కుమార్, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









