పట్టేడు కోయ గిరిజన సంస్కృతి పై అధ్యయన గ్రంథం ఆవిష్కరణ – మంత్రి సీతక్క
హైదరాబాద్, మే 6 ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాజం యొక్క విలువైన సాంస్కృతిక చిహ్నాలైన పట్టేడు కోయ తెగల జీవన విధానం, సంప్రదాయాలపై రూపొందించిన విశేష సాహిత్య గ్రంథాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. సీతక్క మంగళవారం హైదరాబాద్ ప్రజా భవన్ లో ఆవిష్కరించారు.
ఈ గ్రంథాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వీరాపురం గ్రామానికి చెందిన కుంజా వరలక్ష్మి (w/o వజ్జా నరసింహారావు) రచించారు. ఆమె పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంపీల్ విద్యార్థినిగా గిరిజన జ్ఞానపీఠ విభాగంలో ఈ అధ్యయనాన్ని పూర్తి చేశారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ,
“ఆదివాసీ చరిత్రను, సంస్కృతిని సజీవంగా నిలుపాలన్న ఉద్దేశంతో రూపొందించిన ఈ గ్రంథం భావితరాలకు మార్గదర్శిగా నిలుస్తుంది. కుంజా వరలక్ష్మి పరిశోధన సామెతను సాకారం చేస్తోంది – ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు’” అని పేర్కొన్నారు.
ఈ గ్రంథ పర్యవేక్షణను చేపట్టిన ఆచార్య బట్టు రమేష్ మాట్లాడుతూ, గిరిజనల పై పరిశోధనలకు విశ్వవిద్యాలయం అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర, నిజాం కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ ఆప్కా నాగేశ్వరరావు, రచయిత శోభ రమేష్, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్లు సాగబోయిన పాపారావు, అరేం అరుణ్ కుమార్, ఇతర లా విద్యార్థులు పాల్గొన్నారు.









