పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభోత్సవం – శాఖల అధికారులతో సమీక్ష సమావేశం
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని రఘునాధపాలెంలో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయితీ కార్యాలయాన్ని పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
కార్యాలయం స్థలాన్ని దానంగా ఇచ్చిన పోలెబోయిన ప్రభాకర్ రావు, నరసింహారావు, కృష్ణమూర్తి, ముత్తయ్యలకు శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో కలిసి పంచాయతీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పథకాలు ప్రజల వరకు చేరుతున్నాయా లేదా అన్న అంశంపై అధికారులను ప్రశ్నించి, సమస్యలు ఉంటే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నీటి సరఫరా, విద్యుత్, సాగు, విద్య, వైద్యం వంటి అంశాలపై అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి మంజూరు అయ్యేలా చూడటం తన బాధ్యతగా భావిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
స్థానికులు వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందించగా, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు.
కార్యక్రమంలో కరకగూడెం ఎమ్మార్వో నాగప్రసాద్, అన్ని శాఖల అధికారులు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ హుసేన్, మాజీ సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి, మండల నాయకులు ఎర్ర సురేష్, మహిళా నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









