భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
బూర్గంపాడు, ఆధాబ్ న్యూస్ :
బూర్గంపాడు మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్, భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో బూర్గంపాడు ఎమ్మార్వో ముజాహిద్, ఎంపిడిఓ ప్రధాన అతిథులను పూలగుచ్ఛాలతో సత్కరించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచంగా మారబోతోందని అన్నారు. భూ భారతి ద్వారా భూముల సర్వే నిర్వహించి, హద్దులు ఖచ్చితంగా నిర్ణయించి, మ్యాపులతో కూడిన సమాచారం నమోదు సమయంలో అందించనున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల భూములపై అక్రమ ఆక్రమణలకు అవకాశం ఉండదని, రైతులు తమ భూముల వివరాలను ఆన్లైన్లో సులభంగా చూడగలరని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటేల్ మాట్లాడుతూ, గతంలో భూ సమస్యలు తలెత్తితే కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు భూ భారతి చట్టం ద్వారా 90 శాతం కేసులు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారమవుతాయని, అవసరమైతే ఆర్డీఓ లేదా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చని చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికి ఈ చట్టం ఎంతో ఉపయుక్తంగా మారుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడీవో తాతారావు, ఎమ్మార్వో ముజాహిద్, ఎంపిడిఓతో పాటు ప్రభుత్వ అధికారులు, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దుర్గంపూడి కృష్ణారెడ్డి, మహిళా నాయకులు, యువజన నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









