కరకగూడెం,ఆధాబ్ న్యూస్ : వక్ఫ్ బోర్డులో ప్రతిపాదిత సవరణలను వ్యతిరేకిస్తూ కరకగూడెంలో శనివారం ముస్లిం సమాజం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసింది. జామా మస్జీద్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీకి మండల ముస్లిం కమిటీ ఆధ్వర్యం వహించింది.
వక్తలు ఈ సందర్భంగా మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజానికి చెందిన పవిత్రమైన మతపరమైన మరియు సామాజిక వారసత్వ సంపద అని, వాటి పరిరక్షణ వక్ఫ్ బోర్డు ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు వక్ఫ్ బోర్డు స్వయంప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉన్నాయని, ప్రభుత్వ జోక్యానికి దారి తీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వక్ఫ్ ఆస్తులు మతపరమైన అవసరాలకు తరతరాలుగా వినియోగించబడుతూ వచ్చినదని, వాటి పవిత్రతకు భంగం కలిగించే ఏ మార్పులనూ ముస్లిం సమాజం సహించదని స్పష్టం చేశారు. తక్షణమే వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాలు ముమ్మరంగా కొనసాగుతాయని హెచ్చరించారు.
ర్యాలీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి సీపీఎం మండల కమిటీ కన్వీనర్ కొమరం కాంతారావు మద్దతు తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ వట్టం కాంతయ్యకు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మండల ముస్లిం మైనారిటీ నాయకులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, షేక్ సోందు పాషా, సయ్యద్ సజ్జాద్ హుస్సేన్, పఠాన్ యాకుబ్ ఖాన్, అక్బర్ ఖాన్, రఫీ, ఖలీల్, ఆరిఫ్, షేక్ యాకుబ్, గయాస్, సయ్యద్ అన్వర్, షేక్ అజ్జు, ఇలియాజ్, రియాజ్, ఎండీ ఖయ్యుమ్ తదితరులు పాల్గొన్నారు. పలు మస్జీదుల మౌలానాలు, మహిళలు కూడా భారీ సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొన్నారు.









